వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఐఏఎస్ అధికారి ప్రతీక్ జైన్ పై దాడి సంఘటనను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. బుధవారం నల్గొండలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక ఐఏఎస్ అధికారిపై దాడి చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం కలెక్టర్ ను పిలిపించి దాడికి పాల్పడ్డారని, ఇది దేశంలోనే ఘోరమైన సంఘటన అని అన్నారు. కాలేశ్వరం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ వంటి అవసరం లేని ప్రాజెక్టులకు భూసేకరణ జరిగినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగినా ప్రభుత్వాన్ని బ్రతిమిలాడారే తప్ప ఏ రోజు దాడులకు పాల్పడలేదని, అలాంటిది ఈరోజు ఒక జిల్లా కలెక్టర్ పై దాడికి దిగడం దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. ఈ సంఘటన వెనక ఎంత పెద్దవారు ఉన్నా క్షమించేది లేదని, ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామని, ఎంతటివారినైనా వదిలిపెట్టబోమని ఆయన అన్నారు.
రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న మిల్లర్స్ పైన ఎస్మా వంటి కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించినప్పటికి కొందరు మిల్లర్లు కావాలని రైతులను ఇబ్బందులకు గురిచేయడం పట్ల ఆగ్రహంవ్యక్తం చేశారు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మిల్లర్లు రైతులకు సహకరించకుండా ఇబ్బందులు పెడుతున్నారని, అలాంటి వారిపై అవసరమైతే ఎస్మా కేసులు తప్పవని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేవలం 10 శాతం బ్యాంకు గ్యారెంటితో ప్రభుత్వం ధాన్యాన్ని మీల్లులకు కేటాయిస్తున్నదని, అంతేకాక మిల్లింగ్ చార్జీలు పెంచడం వంటి అన్ని రకాల సహాయ, సహకారాలను మిల్లర్లకు అందిస్తున్నదని, అందువల్ల ప్రభుత్వం ఇస్తున్న చయూతను దృష్టిలో ఉంచుకొని, మిల్లర్లు ముందుకు వచ్చి రైతులకు, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
జిల్లాలో ఐకెపి ద్వారా దాదాపు 60 – 70% ధాన్యం కొనుగోళ్లను పూర్తిచేశామని చెప్పిన మంత్రి. కలెక్టర్ తో సహా అధికారులందరు అదే పనిలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. కొందరు మిల్లర్ల వల్ల కొన్ని చోట్ల కొంత ఆలస్యం జరగడంతో రైతులు బాధపడ్డారని, మిల్లర్లు చేసిన దుర్మార్గమైన పనికి మంత్రిగా తాను చింతిస్తున్నానన్నారు. రైతులను గోసపెట్టినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఒక వారంలోనే ధాన్యం మొత్తం కొనుగోలు చేసేలా యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లను చేపట్టామని చెప్పారు.
తెలంగాణాలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి రూపాయి ఫాయిదాలేదన్న మంత్రి.. పొద్దున్న లేస్తే గల్లీ రాజకీయాలు చేయడం తప్ప రాష్ట్రానికి చేసిన మేలేంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో ఆలస్యం జరిగి రైతులు ఇబ్బందులు పడుతుంటే.. దాని పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వండి కానీ, బురదజల్లే ప్రయత్నం చెయ్యకండని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హితవు పలికారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సివిల్ సప్లయి శాఖను నిర్వీర్యం చేసి, దాదాపు 11 వేల కోట్ల రూపాయల లెక్కలు లేకుండాపోతే, దానివల్ల మిల్లర్లు కొన్ని షరతులు పెట్టడం వల్ల, ప్రజాధనం వృధా కావద్దని ఉద్దేశ్యంతో చర్యలు చేపట్టడం వల్ల కాస్త ఆలస్యం జరిగిందని.. ఇకపై ఒక్కరోజు కూడా ఆలస్యం జరగదని మంత్రి చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుందని చెప్పిన ఆయన అధికారం పోయి, కేసులు మీద పడుతుంటే తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ తో అధికారుల మీద దౌర్జన్యాలకు దిగే స్థాయికి వచ్చారని ఆయన మండిపడ్డారు. కలెక్టర్ ఇతర అధికారులపై దాడిచేసిన వారు ఎంతటివారైన చర్యలు తప్పవని చెప్పిన మంత్రి.. చట్టం తనపని తాను చేసుకుపోతుందని తేల్చిచెప్పారు.
నల్గొం జిల్లాలోనే అత్యధికమంది టెలిఫోన్ ట్యాపింగ్ దొంగలున్నారని.. విచారణ పూర్తయితే వారు ఊచలు లెక్కించక తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రభాకర్ రావు బయటికొస్తే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలందరి బాగోతాలు బయటపడతయని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో దాదాపు 70 శాతం మంది జైలు లోనే ఉన్నారన్న మంత్రి. ధరణి ఈ నెల 29 నుంచి ఎన్.ఐ.సి కంట్రోల్ కి పోతుందని, ధరణి స్కామ్లో అందులో అమోయ్ కుమార్ తో పాటు ఇంకెంతమంది ఐ.ఏ.ఎస్ ఆఫీసర్లు పోతారో తెలీయదని ఆయన అన్నారు.
ఈ సమీక్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జై వీర్ రెడ్డి, అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల డిఎం హరీష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, జిల్లా సహకార శాఖ అధికారి పత్యా నాయక్, మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు .