హస్తిన గుప్పెట్లోకి వెళ్తోన్న తెలుగు నేతలు..అధికార పార్టీపై ఆరోపణలు చేస్తూ కేంద్రానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాల ఫిర్యాదు.ఫార్మూలా రేసింగ్ స్కాంకు.. అమృత్ ఎపిసోడుతో చెక్ చెప్పే వ్యూహంలో కేటీఆర్.డ్రగ్స్ కంటైనర్ పై పవన్ విమర్శలను తిప్పికొట్టేలా అమిత్ షాకు బొత్స లేఖ.తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు మళ్లీ ఢిల్లీ చుట్టూ తిరిగే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీ పెద్దలపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ యువరాజు కేటీఆర్ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయగా.. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరిపై అమిత్ షాకు కంప్లైంట్ లెటర్ రాశారు బొత్స. ఇదిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది. ఫార్మూల-10 రేసింగ్ విషయంలో కేటీఆర్ ను చెరసాలకు పంపేందుకు రేవంత్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో సడెనుగా కేటీఆర్ ఢిల్లీ బాట పట్టారు. అమృత్ స్కీంలో అవినీతి జరిగిందని.. అవినీతికి పాల్పడిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని.. అమృత్ స్కీంలో స్కాంపై విచారణ చేయించాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కోరారు కేటీఆర్. నన్ను అరెస్ట్ చేస్తే.. నీ మీద కేసులు వేయిస్తా.. నేను ఢిల్లీ పెద్దలకి దగ్గర అని చెప్పుకునేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.మరోవైపు విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ కంటైనర్ వ్యవహరం తేల్చాల్సిందిగా ఇటీవలే పవన్ ట్వీట్ చేశారు. దీని వెనుక వైసీపీ ఉందనే అర్థం వచ్చే రీతిలో విమర్శలు గుప్పించారు పవన్. ఆ డ్రగ్స్ కంటైనర్ వెనుక బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి ఉందనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇందులో నిజానిజాలను వెలికి తీయాల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాయడం ద్వారా పవన్ను.. తద్వారా కూటమిని కార్నర్ చేసేలా బొత్స లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్కుగా మారింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల రాజకీయం ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతోందనే చెప్పాలి. దీంతో వెళ్లాలి ఢిల్లీ.. మళ్లీ మళ్లీ. అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది.
- Advertisement with us -