ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడు పోలీసు విచారణకు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ కోణాలు వెలుగు చూస్తుండటంతో బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్యను ఈ నెల 11వ తేదీ విచారణకు హాజరుకావాలని తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే అనారోగ్య కారణాల వల్ల తాను 11వ తేదీ విచారణకు హాజరు కాలేనని, 14వ తేదీ విచారణకు వస్తానని చిరుమర్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాని ప్రకారం గురువారం ఆయన పోలీసుల ముందుకు విచారణ కోసం హాజరుకానున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో ప్రత్యర్దులపై ఫోన్ ట్యాపింగ్ ప్రయోగించారనే అభియోగాలు ఉన్నాయి. అలాగే ఆ ఉప ఎన్నికలో పోలీసుల ద్వారా నగదు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటి మీద ఈ రోజు చిరుమర్తి లింగయ్యను విచారించనున్నారు పోలీసులు.