తెలంగాణ రాజకీయాలు హస్తినకు చేరాయి.ఒకేసారి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లతో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సైతం ఢిల్లీ వెళ్లడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం రేవంతరెడ్డిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి సోమవారమే ఢిల్లీ చేరుకున్న కేటీఆర్.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహరలాల్ ఖట్టర్ ని కలసి అమృత్ పథకంలో భారీ స్కాం జరిగిందని రేవంతరెడ్డిపై ఫిర్యాదు చేసారు.తన బావమరిది సృజనరెడ్డికి వందల కోట్ల రూపాయల లబ్ది చేకూర్చారని తెలంగాణ సీఎం పై కేంద్ర మంత్రికి కేటీఆర్ ఫిర్యాదు చేసారు. మరోపక్క ముఖ్యమంత్రి రేవంతరెడ్డి సైతం మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో అధిష్టానంతో చర్చించడానికి తెలంగాణ సీఎం ఢిల్లీ వెళ్లడంతో టీ కాంగ్రెస్ నేతల్లో అలజడి నెలకొంది. పనిలోపనిగా మంత్రివర్గ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం ఉండటంతో ఆశావహులు అందరూ ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ అగ్రనేతలు ఇద్దరు ఢిల్లీలో ఉండగానే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా హస్తిన చేరుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఏసీబీ విచారణకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనపై రాజకీయవర్గల్లో ఉత్కంఠ నెలకొంది.