జమిలి ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ బిల్లును పార్లమెంటు ముందుకు తెచ్చేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఒకే దేశం, ఒకే ఎన్నిక కార్యరూపం దాల్చబోతోంది. ఇది ఉభయ సభలు ఆమోదిస్తే కేంద్రానికి, రాష్ట్రాలు,యూనియన్ టెరిటరీలకు ఇకపై ఏక కాలంలో ఎన్నికలు నిర్వహిస్తారు.రాబోయే కాలంలో మున్సిపల్ ఎన్నికలు కూడా ఈ ఎన్నికలతోనే కలిపి నిర్వహించేలా యంత్రాంగాన్నిరూపు దిద్దుతారు.
డీ లిమిటేషన్ ప్రక్రియ..
జమిలి బిల్లు కార్యరూపం దాల్చాలంటే మన రాజ్యాంగానికి కనీసం ఐదు సవరణలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకు ముందు జనగణన జరగాలి. జనాభా లెక్కన రాష్ట్రాలలో నియోజక వర్గాల పునర్విభజన జరగాలి. జనాభా ఆధారంగా రాష్ట్రాలు, నియె జక వర్గాల నైసర్గిక స్వరూపం మారనుంది.దానిని బట్టి రాష్ట్రాలలో లోక్ సభ, అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్య పెరగనుంది. అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నది ఈ డీ లిమిటేషన్ బిల్లుకోసమే.రాజ్యాంగంలోని ఆర్టికల్ 82కి దీనికి సంబంధించిన సవరణ చేయాలి. కేంద్రం, రాష్ట్రాల కోసం తెచ్చే రెండు వేర్వేరు బిల్లుల వల్ల ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరగుతాయి. ఇదొక కీలకమైన రాజ్యాంగ సవరణ.
కాలపరిమితిని సరిచేసే సవరణ
ఇక మరో కీలకమైన రాజ్యాంగ సవరణ పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే కాల పరిమితి ఉండేలా చేయడానికి సంబంధించినది. కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, ఢిల్లీ,జమ్ము కశ్మీర్ అసెంబ్లీలను రాష్ట్రాలు, లోక్ సభ తో సరిసమానం చేస్తూ మూడు బిల్లులు ఆమోదించాలి.అయితే ఈ సవరణకు కనీసం సగం రాష్ట్రాలు అంగీకారం తెలపాలన్న నియమమేదీ లేదు.అయితే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఈ ఎన్నికలతోనే కలిపి నిర్వహించాలంటే మాత్రం కనీసం 50 శాతం రాష్ట్రాలు అందుకు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్రాల పరిధిలోని అంశం.
ఇది గేమ్ ఛేంజర్
వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒక గేమ్ ఛేంజర్ అంటున్నారు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పానెల్ కు నేత్రుత్వం వహిస్తున్న రామ్ నాథ్ కోవింద్ ఇవాళ ప్రధాని మోడీని కూడా కలసి కొన్ని సూచనలు చేశారు. జమిలి ఎన్నికలకు దేశవ్యాప్తంగా సానుకూలత వ్యక్తమవుతోందని అన్నారు. జమిలి ఎన్నికల వల్ల ఆర్థికప్రగతి బాగుంటుందని, అనవసర వ్యయం, దుబారా తగ్గుతుందని అన్నారు.
సవాళ్లు దాటేదెలా?
జమిలి ఎన్నికల అంశం బాగానే అనిపిస్తున్నా.. కేంద్రంలో ప్రభుత్వం కుప్ప కూలినప్పుడు, ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చినప్పుడు, కేంద్రంలో లేదా రాష్ట్రాల్లో హంగ్ ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఏం చేయాలన్న దానికి పరిష్కారం లేదు.అలాగే అందరి ద్రుష్టి ఎంపీ సీట్లపైనే ఉంటుంది కాబట్టి స్థానిక అంశాలకు ప్రాధాన్యత తగ్గుతుందని సమస్యలు పరిష్కారం కావనే అభిప్రాయం ఉంది.జమిలి ఎన్నికలపై 21 వేల మంది అభిప్రాయాలను సేకరించగా 80 శాతం మంది ఇదే మంచిదని అభిప్రాయపడ్డారు.