రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పెరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. పెద్దపల్లిలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవాల బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కావాల్సిన రోడ్లు, డ్రైయిన్లు, కమ్యూనిటీ హాల్లను నిర్మించామన్నారు. యువకుల పోరాటంతో సాధించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురయ్యారని చెప్పారు. సంవత్సర కాలంలో రికార్డ్ స్థాయిలో 55 వేల 143 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి బస్సు డిపో ఎన్నో యేళ్ల కలగా మారిందని, ఆ కలను ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. పెద్దపల్లి పట్టణ వాసుల కోరిక మేరకు రూ.82 కోట్లతో బైపాస్ రోడ్డు మంజూరు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించారని చెప్పారు. రూ.79 కోట్లతో పంచాయతీరాజ్ గ్రామీణ రోడ్లు మంజూరు చేశామన్నారు. సింగరేణి సంస్థ ద్వారా రూ.23 కోట్లతో రామగుండంలో అభివృద్ధి పనులు చేయిస్తున్నామన్నారు. రూ.51 కోట్లతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిని 100 పడకలకు అప్గ్రేడ్ చేయిస్తున్నామని శ్రీధర్బాబు చెప్పారు. అలాగే పట్టణంలో రూ.26 కోట్లతో నర్సింగ్ కళాశాల పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ప్రైవేట్ రంగంలో యువతకు ఉపాధి కల్పన కోసం రికార్డు స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. మంథని పట్టణంలో వ్యాపార వాణిజ్యం పెరిగే దిశగా రూ.125 కోట్లతో మంథని- శివారం మధ్య గోదావరి నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ శ్రీ పాద్ మార్గ్ నుంచి మంథని పట్టణానికి రూ.162 కోట్లతో 4 లైన్ల రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతోందని తెలిపారు. రూ.2 కోట్ల 45 లక్షలతో గుంజపడుగులో నూతన పి.హెచ్.సి, రూ.22 కోట్లతో మంథనిలో నూతనంగా 50 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నామని చెప్పారు. రూ.7 కోట్లతో రామగిరి ఖిల్లా, మంథని టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధి జరుగుతోందన్నారు మంత్రి శ్రీధర్బాబు. అలాగే, మూడు నదులు కలిసే కాళేశ్వరం దేవాలయం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారీ పూర్తి కావస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు లాభాలలో వాటా అందించామని గుర్తు చేశారు.సింగరేణి ఉద్యోగులకు సంబంధించి ఇండ్ల స్కీం, పన్నుల విధానంపై కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ కు సూత్ర ప్రాయంగా అనుమతులు ఇచ్చిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. రామగుండంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుతో వ్యాపారాల అభివృద్ధికి అవకాశం కలుగుతోందన్నారు. టెయిల్ ఎండ్ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో పాలకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మించాలని, పోతారం ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని శ్రీధర్బాబు గుర్తు చేశారు.