బుధవారం ఉదయాన్నే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను వణికించిన భూకంప కేంద్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉండటం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. జిల్లా వాసుల్లో భయాందోళన రేకెత్తించింది. అధకార వర్గాలు, ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల నిర్ధారణ ప్రకారం బుధవారం ఉదయం సరిగ్గా 7గంటల 27 నిమిషాలకు భూ ప్రకంపనలు మొదలయ్యాయి. కొన్నిచోట్ల రెండు సెకనుల నుంచి మొదలుకొని… 15 సెకనుల దాకా భూమి కంపించింది. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచే కలకలం మొదలయ్యింది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగుతో పాటు.. ఏటూరునాగారం మండలం శంకర్రాజుపల్లి పరిసర గ్రామాల్లో పది సెకనుల పాటు భూమి కంపించిందంటున్నారు. ఇళ్లు ఊగడం మొదలు కాగానే జనం ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. హన్మకొండ హంటర్రోడ్, న్యూ శాయంపేటలోనూ కొద్దిసేపు భూమి కంపించింది. ఇటు.. జనగామలోనూ స్వల్పంగా భూమి కంపించింది. అటు.. సిద్ధిపేటలోనూ భూమి కంపించింది. మరోవైపు.. పరకాలలోనూ ఉదయం భూమి ఒక్కసారిగా కనిపించడంతో ఏం జరుగుతుందో అని ప్రజలు బయటకు పరుగులు తీశారు. 10 సెకండ్లల పాటు భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అనే భయంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పరకాల, నడికూడ, రేగొండ, మొగుళ్లపల్లి, శాయంపేట మండలాల్లో భూమి కనిపించింది.