తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ సెమ్మెకు పూనుకుంది. ఈ మేరకు తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామి సోమవారం బస్ భవన్ లో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ ముని శేఖర్ కి ఆర్టీసీ జేఏసీ నాయకులు ఈదురు వెంకన్న, ధామస్రెడ్డిలు నోటీస్ అందజేశారు. ఈ సంవత్సరంగా తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకులు వెంకన్న, ధామస్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతోందని, ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరినీ కలిసి విజ్ఞప్తి చేసినా మా సమస్యలు పరిష్కరించడం లేదని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం విలీన ప్రక్రియ 90 శాతం పూర్తి చేసిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దానిని ఎందుకు పూర్తి చేయడంలేదో అర్ధం కావడం లేదని జేఏసీ నేతలు అంటున్నారు. 2021 పీఆర్సీ ఎందుకు అమలు చెయ్యడం లేదని, ప్రభుత్వానికి 14 నెలలు సమయం ఇచ్చామని ఇంక మాకు ఓపిక లేదని అన్నారు. ఆర్టీసీని అభివృద్ధి చేస్తామని ఓ పక్క చెప్పి మరోపక్క ప్రైవేటు బస్సులను ప్రవేశపెట్టి ఆర్టీసీ మనుగడకు ప్రమాదం కలిగేలా చేస్తున్నారని జేఏసీ నేతలు ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. 15 రోజుల్లో యాజమాన్యం స్పందించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని రాజకీయ పార్టీలను కలసి మద్దతు కోరి సమ్మెకు దిగుతామని జేఏసీ నాయకులు ఈదురు వెంకన్న, ధామస్ రెడ్డిలు స్పష్టం చేశారు.