కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 8 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఎన్నో హామీలిచ్చి ఆకర్షించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 93 మంది ఆటో డ్రైవర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని అభివర్ణించారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల జాబితాను సర్కారుకు ఇచ్చామని, అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డేట్టే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లను ఎన్నికల కోసం వాడుకున్న ప్రభుత్వం.. వారికి ఇచ్చిన హామీలన్నింటిని మర్చిపోయిందన్నారు. ఆటో డ్రైవర్లకి ఇస్తామని చెప్పిన 12 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే ప్రకటించాలన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఎర్పాటు చేస్తామన్న హమీని కూడా వెంటనే అమలు చేయాలని కేటీఆర్ గుర్తు చేశారు. ఇక, ఆటోడ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారి కోసం పోరాడతామని భరోసా ఇచ్చారు. ఆటోడ్రైవర్లకు సంఘీభావంగా తాము ఆటోల్లో అసెంబ్లీకి వెళుతున్నామని చెప్పారు. అంతేకాదు.. ఆటోడ్రైవర్ల యూనిఫామ్లు ధరించి వాళ్లకు సంఘీభావం తెలుపుఉతున్నామన్నారు. అటో డ్రైవర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆటోడ్రైవర్ల డిమండ్లు, వాళ్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ ముందు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కేటీఆర్ ఆటో డ్రైవ్ చేస్తూ అసెంబ్లీకి వచ్చారు.