జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో అపశృతి చోటుచేసుకుంది. గ్రామంలోని అమరేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ విగ్రహం దగ్దమయ్యింది. ఈ ఘటనతో ఊరంతా ఉలిక్కి పడింది. దేవాలయంలోని గర్భగుడిలో విగ్రహం దగ్ధం కావడం అంతు చిక్కని మిస్టరీగా చెబుతున్నారు. అమరేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ విగ్రహం కూడా ఉంది. అయితే, ఏం జరిగిందో, ఏమో.. గురువారం సాయంత్రం హనుమాన్ విగ్రహం దగ్గర మంటలు చెలరేగాయి. స్వామివారి విగ్రహం మొత్తానికి మంటలు వ్యాపించాయి.
ఆంజనేయస్వామి విగ్రహం అగ్నికి ఆహుతి అవుతుండడం గమనించిన స్థానికులు.. నీళ్లు పోసి మంటలు ఆర్పేశారు. కానీ మంటలు ఎలా చెలరేగాయి? విగ్రహం పై ఎలా మంటలు వ్యాపించాయి? అనేది అంతు చిక్కడం లేదు. విగ్రహం మంటల్లో కాలిపోవడం దృష్టశక్తుల పనేనా? లేదంటే ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయా? అనే అనుమానాలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమ గ్రామాన్ని కాపాడుతున్నాడనుకుంటున్న హనుమంతుడి విగ్రహమే మంటల్లో దగ్ధం కావడం ఊరికి అరిష్టమని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.