వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న దర్శనానికి ముందు రాజ రాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ధర్మగుండం వద్ద 76 కోట్ రూపాయలతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేసి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం స్థల పురాణాన్ని పురోహితులు ముఖ్యమంత్రికి వివరించారు.
అనంతరం దేవాలయ అభివృద్ధి పనుల వివరాలను అధికారులు వివరించారు. అంతకుముందు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయం లోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి , రాజరాజేశ్వరి అమ్మవారు వద్ద అర్చన, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అభిషేకం వంటి ప్రత్యేక పూజలను ముఖ్యమంత్రి నిర్వహించారు.
పూజల అనంతరం ముఖ్యమంత్రి, మంత్రి వర్యులకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు.