కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్దం ప్రకటించబోతోందన్నారు. మహారాష్ట్రలో ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ కూటమిని నమ్మలేదన్నారు. కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని, ఆ పార్టీతో జతకట్టిన పార్టీలన్నీ మునిగిపోతున్నాయన్నారు.
కాంగ్రెస్ కూటమి ముక్కలు కావడం ఖాయమన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలుకాబోతున్నాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం, అవసరం బీజేపీకి లేదని చెప్పిన బండి సంజయ్…. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూల్చుకుంటారని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కరీంనగర్ లోని మహాశక్తి ఆలయ ఆవరణలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు… ఏమన్నారంటే…
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయ దుందుబి మోగించింది. కాంగ్రెస్ పార్టీకి గతం కంటే తక్కువ సీట్లు వచ్చినయ్. కాంగ్రెస్ కూటమి అడ్రస్ గల్లంతైంది. ఎన్ని అబద్దపు ప్రచారాలు చేసినా జనం నమ్మలేదు. నరేంద్రమోదీ అభివ్రుద్ధి మంత్రం పనిచేసింది. కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చేందుకు ఎన్ని కుట్రలు చేసినా జనం నమ్మలేదు. మహారాష్ట్ర ప్రజలు ఐక్యత ప్రదర్శించారు. హిందుత్వవైపు నిలబడ్డారు.
తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీ డబ్బు సంచులు తీసుకెళ్లి మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు చేశారు. అబద్దాలు, డబ్బుతో గెలవాలని చూశారు. కానీ అవేమీ పని చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇచ్చిన హమీలను అమలు చేయకుండా తెలంగాణ, కర్నాటక ప్రభుత్వాల వైఫల్యాలే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి ప్రధాన కారణం. ఆయా రాష్ట్రాల్లో ఒక్క హామీని అమలు చేయకుండానే….అన్నీ చేసినట్లుగా కోట్లాది రూపాయల యాడ్స్ ఇచ్చి అబద్దపు ప్రచారం చేయాలని చూసినా జనం నమ్మలేదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మహారాష్ట్రలో తిష్టవేసి పోలింగ్ బూత్ ల వారీగా ప్రచారం చేసినా పట్టించుకోలేదు. వాస్తవాలు గ్రహించి కాంగ్రెస్ కూటమిని చావు దెబ్బ కొట్టారు. మహారాష్ట్ర ప్రజలకు హ్యాట్సాఫ్… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేసిన అన్ని చోట్లా కాంగ్రెస్ ఓడిపోయింది
కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ. ఆ పార్టీతో జతకట్టిన పార్టీలన్నీ నిండా మునిగిపోతున్నయ్. కాంగ్రెస్ కూటమి చీలడం ఖాయం. కూలిపోవడం తథ్యం. ఎందుకంటే ఐరన్ లెగ్ పార్టీతో ఎవరూ ఉండే అవకాశం లేదు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మహారాష్ట్రలో పట్టిన గతే పడుతుంది. ఎందుకంటే ఒక్క హామీలను అమలు చేయలేదు.
తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడానికి పైసల్లేవని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సొమ్మును తీసుకుపోయి మహారాష్ట్రలో ఖర్చు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్దం ప్రకటించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు రాబోతోంది. హమీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు ఇప్పటికే ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్క పని కావడం లేదని ఎమ్మెల్యేలు కూడా అసంత్రుప్తితో ఉన్నారు. అందుకే ఆ పార్టీలో లుకలుకలు రాబోతున్నాయ్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేం కూల్చబోం. మాకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ అవకాశం కూడా ఇవ్వరు. ఆ అవసరం కూడా మాకు లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వాళ్ల ప్రభుత్వాన్ని కూల్చేస్తారు.
కులగణన పెద్ద బోగస్. కులగణన ఫారంలపై పెన్సిల్ తో రాస్తున్నారు. పెన్నుతో సంతకం తీసుకుంటున్నారు. ఎందుకంటే పెన్సల్ తో రాస్తే… తరువాత కాంగ్రెస్ పార్టీ తనకు అనుగుణంగా మార్పు చేసుకోవాలనుకుంటోంది. అందుకే ప్రజలు సహకరించడం లేదు. చాలాచోట్ల నిలదీస్తున్నారు. నేనడుగుతున్న కేసీఆర్ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది కదా. ఆ రిపోర్ట్ బయటపెట్టాలి. ఆ రిపోర్ట్ లేకపోతే.. దానికైన సొమ్మంతా కేసీఆర్ నుండి రికవరీ చేయాలి.