ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి చుట్టూ రాజకీయాలు ముసురుకుంటున్నాయి. ఇప్పటి వరకూ వివాదాస్పదంగా ఉన్న ప్రతిపక్ష హోదాకు తోడు తాజాగా పీఏసీ చైర్మన్ పదవి తోడయ్యింది. కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారన్న నెపంతో వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే కారణం చూసించి ప్రతిపక్ష సీనియర్ సభ్యుడికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వకుండా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్ని తుంగలో తొక్కింది కూటమి ప్రభుత్వం. అసెంబ్లీ కమిటీల్లో కీలకమైన పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష సీనియర్ సభ్యుడికి ఇవ్వడమనేది చట్టసభల్లో ఎప్పటి నుంచో ఆనవాయితీ వస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ కు పీఏసీ పదవి ఇచ్చి ఆ సాంప్రదాయాన్ని కొనసాగించింది. వాస్తవానికి ఈ నిర్ణయాధికారం స్పీకర్ చేతిలో ఉంటుంది. అయితే స్పీకర్ కూడా అధికార పార్టీ సభ్యుడే అయి ఉంటారు కాబట్టి సాధారణంగా సభా నాయుకుడు అనుకున్న వ్యక్తులే అసెంబ్లీలో అన్ని కమిటీలకు అధ్యక్షులుగా, సభ్యులుగా అవుతారు. తాజాగా పీఏసీ చైర్మన్ పదవి ఆనవాయితీ ప్రకారం తమకే ఇస్తారని వైఎస్సార్సీపీ భావించింది. అయితే చంద్రబాబు వైఖరి ఆ దిశగా లేకపోవడంతో నిన్న సీనియర్ శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో నామినేషన్ వేయించింది. దీంతో పీఏసీ చైర్మన్ పదవికి ఎన్నిక అనివార్యం అవ్వడంతో చంద్రబాబు తన రాజకీయానికి పదును పెట్టి కూటమి పక్షాల నుంచి కూడా భారీగా నామినేషన్లు వేయించారు. టీడీపీ నుంచి ఏడుగురు, జనసేన, బీజేపీల నుంచి ఒక్కొక్కరు చొప్పున నామినేషన్ వేశారు. అధికార పక్షం నుంచి తొమ్మొది నామినేషన్లు పడటంతో వైఎస్సార్పీపీ వ్యూహాత్మకంగా తన సభ్యుడితో నామినేషన్ ఉపసంహరింప చేసింది. ఎన్నికలకు కొద్ది గంటల ముందు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చట్టసభల సంప్రదాయాలను గౌరవించడం లేదనే అంశాన్ని ఎత్తిచూపడానికే వైసీపీ తమ సభ్యుడితో నామినేషన్ వేయిందని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. పార్లమెంట్ లో సైతం సంఖ్యా బలంతో సంబంధం లేకుండా ప్రతిపక్ష సభ్యుడికే పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చారని” ఈ సందర్భాంగా పెద్దిరెడ్డి గుర్తు చేశారు. ఇదిలా ఉండగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకున్నా పీఏసీ చైర్మన్ పదవి కోసం పోలింగ్ నిర్వహించారు.
- Advertisement with us -