వికారాబాద్ జిల్లా లగచర్లలో జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు రిమాండ్ విధించింది. న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. లగచర్లలో అధికారులపై బీఆర్ఎస్ వర్గాలు దాడి చేసిన వ్యవహారంలో నరేందర్రెడ్డికి ప్రమేయం ఉందన్న ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తున్న నరేందర్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన్ను కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఈనెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అయితే, ఆ సమయంలో కొడంగల్ కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నరేందర్ రెడ్డిని తరలిస్తున్న కారును బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.