కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉందని అన్యాయానికి తావు లేదని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం హైదరాబాద్ గాంధీభవన్ లో జరిగిన మంత్రితో ముఖా ముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు వివిధ సమస్యలను ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. జెన్ కో లో చేపట్టిన ఉద్యోగాల భర్తీ త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు.
ఉద్యాన శాఖ, తూనికలు కొలతలు తదితర శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రాలేదని, మరికొన్ని శాఖల్లో నోటిఫికేషన్ విడుదలైనా పరీక్షలు నిర్వహించలేదని డిప్యూటి సిఎం దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు.
గత ప్రభుత్వ హయంలో పదేళ్ళ పాలనలో ఉద్యోగాల భర్తీ… కాంగ్రెస్ ఏడాది పాలనలో ఉద్యోగ నియామకాలపై నిరుద్యోగులను అడిగి తెలుసుకున్నారు. వికాలంగుల పెన్షన్ మంజూరులో జాప్యం జరుగుతోందని భట్టి దృష్టికి రాగానే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వే పేరుతో తమ భూమి లాక్కున్నారని ఓ వృద్ధుడు ఫిర్యాదు చేయగా… త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.