తాను ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించడంతో పాటు.. ఎన్నికల ఫలితాల పరిశీలకుడిగా జార్ఖండ్ ఎన్నికల వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షించిన ఏఐసీసీ ప్రతినిధిగా జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. ఈ దేశాన్ని ఒక వికృతమైన పార్టీ పరిపాలిస్తోందని, ఆ పార్టీని కాదని మిమ్ములను ఎన్నుకున్న ప్రజల కోసం కష్టపడి పని చేయాలని సూచించారు. ఆదివారం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ను కాంగ్రెస్ కీలక నేతలతో కలిసి చర్చలు జరిపారు, తదుపరి ఇండియా కూటమి నేతలు అంతా కలిసి గవర్నర్ను సంప్రదించి సంఖ్యా బలాన్ని వివరించారు. ఆదివారం సాయంత్రం రాంచీలోని హోటల్ చాణక్యలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ దేశాన్ని విచ్చిన్నం చేయాలని వికృత పార్టీ చూస్తోంది, అటువంటి విచ్ఛిన్నకర పార్టీని కాదని మిమ్ములను ఎన్నుకున్న ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు గట్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యేలను కోరారు. ఈ సమావేశంలో కూర్చున్న వాళ్లు అదృష్టవంతులు, ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని బలంగా ఆశించారు, ఆశించిన అందరికీ సీట్లు దొరకలేదు అన్నారు. కానీ రాజకీయాల్లో పనిచేయడం ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీలో పని చేయడం అదృష్టం అనుకోవచ్చు అని వివరించారు. ఎందుకంటే ఈ పార్టీ దేశాన్ని వలస పాలన నుంచి విముక్తి చేసింది, ప్రజాస్వామ్య పరిరక్షణకు అలుపెరగని పోరాటం చేస్తుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర పార్టీ మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తుందని,, తెలంగాణ ప్రభుత్వం, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన మీ అందరిని అభినందిస్తున్నానని భట్టి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ ఇంచార్జ్ సిరివెళ్ల ప్రసాద్, ఏఐసిసి సెక్రెటరీ గులాం అహ్మద్ మీర్, పార్టీ సీనియర్ పరిశీలకుడు పిసిసి ప్రెసిడెంట్ కేశవ్ మహాతో తదితర నాయకులు పాల్గొన్నారు.
జార్ఖండ్ కాంగ్రెస్ నేతలకు భట్టి దిశానిర్దేశం
- Advertisement with us -